Posted on అక్టోబర్ 28, 2012
పొగడ్త.
“నామ పారాయణప్రీతా”ఇది లలితాదేవికి సహస్రనామాల్లో ఒక పేరు. తన నామాని కంటే అయ్య నామాన్ని పారాయణ చేస్తే, అమ్మ సంతోషిస్తుంది, ప్రీతి చెందుతుంది.అమ్మ నామం పారాయణ చేసినా ప్రీతిపొందుతుంది. మరొక సంగతి ధర్మరాజు రాజసూయం చేశాడు, అగ్ర పూజ ఎవరికి చేయమంటావని తాత భీష్ముడిని అడిగితే,
రోదసీ కుహరంబు రుచిరాంశుతతి జేసి,యర్కుండు వెలిగించునట్టు లమృత
సందోహనిష్యంద చంద్రిక జేసి శీతాంశుడానందించునట్టు సకల
జనులకు తనదైన సదమలద్యుతి జేసి తనరంగ దేజంబు దనువు దాన
చేయుచు నున్నసత్సేవ్యుండు పుండరీకాక్షుండు గృష్ణు డనాదినిధను
అబ్జనాభు డుండ నర్ఘ్యంబునకు నిందు నర్హు లొరులు గలరె యజ్ఞపురుషు
నఖిలలోక పూజ్యు నచ్యుత బూజింపు, మధిప యదియ చూవె యజ్ఞఫలము…భారతం…సభా పర్వ….ఆశ్వా.2….6
మరెవరో ఎందుకు గొప్పవాడయిన కృష్ణునికి అగ్ర పూజ చేయమని, అదే యజ్ఞ ఫలమని చెప్పేడు. కృష్ణునికి అగ్ర పూజ జరుగుతూ ఉంటే సహించలేని శిశుపాలుడు, ముందుగా ధర్మరాజుని పట్టుకుని, గొప్ప రాజులుండగా, ధర్మం తెలియని వాడికి అగ్రపూజ తగదంటాడు. కావలసిన వాడయితే సొమ్ములిచ్చుకో, కావలసిన పని చేసిపెట్టుకో, అంతే తప్పించి ఇంతమంది రాజులు, భూసురులు ఉన్న సభలో ముసలాడయిన భీష్ముని మాటపట్టుకుని కృష్ణుడికి అగ్రపూజ తగదన్నాడు. పెద్దవాడని పూజిస్తావా? వసుదేవుడున్నాడుకదా!, ఋత్విజుడనుకుంటే? వ్యాసుడున్నాడు కదా!, ఆచార్యుడని పూజిద్దామనుకుంటే ద్రోణుడున్నాడే!,రాజని పూజించావనుకుంటే, యాదవులు రాజులు కాదుకదా! ఇలా ఇతను ఎందులోకీ చెందనివాడు, నువ్వు భీష్ముని పలుకులతో నవ్వులపాలయి పోయావన్నాడు. అంతెందుకు, నీకు తెలియక ఇస్తే దీనికి నేను అర్హుడను కానననక, కృష్ణుడు ఎలా పుచ్చుకున్నాడయ్యా.! అని తిడుతూ ఉంటే ధర్మరాజు అనునయించాడానికి ప్రయత్నిస్తూ ఉంటే, భీష్ముడు వీడు కుఱ్ఱాడు వదిలెయ్యమని చెప్పి, శిశుపాలుడితో భీష్ముడు,ఈ సభలో వారంతా ఆయన దయకు పాత్రులే, జ్ఞాని అయిన వాడు బాలుడయినా బ్రాహ్మణుడు పూజార్హుడు, క్షత్రియుడు, రాజులందరిలో గొప్పవాడయితే పూజనీయుడు, ఈయన జగదాధారుడు, మాకే కాదు, అందరికీ పూజనీయుడే అన్నాడు.
వృద్ధులొక లక్షయున్నను, బుద్ధియె యెవ్వరికి వారి బూజింపంగా
నిద్ధరణీశులలో గుణవృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్…భార…సభా…ఆశ్వా..2….27
లక్షమంది వృద్ధులున్నా, బుద్ధిలో గొప్పవాడయిన కృష్ణుడిని పూజించామయ్యా అని చెప్పేడు, భీష్ముడు. చిరాకెత్తిన సహదేవుడు, కాదన్న వాడినెత్తి మీద కాలెట్టి తొక్కేస్తా అన్నాడు. ఈ మాటకి దేవతలు ఆనందించి పుష్ప వర్షం కురిపించేరు, నారదుడు ఆడేడు. ఆ తరవాత శిశుపాలుడు, మహాత్ముడయిన జరాసంధుడిని బ్రాహ్మణ రూపంలో భీముడు, అర్జనుడినితోడు తీసుకుని మరే చంపించాడు, అటువంటి వాడిని ఎందుకు తెగ పొగిడేస్తున్నావు, నీకంతగా పొగడాలని ఉంటే సుగుణ వంతులయిన కర్ణుడినో,శల్యుడినో పొగడచ్చుకదా, అంటూ ఉంటే పళ్ళు పటపటా కొరుకుతూ శిశుపాలుని మీద కోపంచూపిస్తున్న భీముని చూసి, భీష్ముడు, శిశుపాలుని జన్మ వృత్తాంతం చెబుతాడు. “వీడు పుట్టినపుడు వికృతంగా పుట్టేడు, ఆకాశవాణి వీడి అవకరాలు ఎవరి చేతిలో హరిస్తాయో, వారి చేతిలోనే వీడు హతుడవుతాడని చెప్పింది, మేనత్త సాత్వతి, తన ఇంటికి వచ్చిన మేనల్లుడు కృష్ణుని చేతికిచ్చింది, శిశుపాలుని, అవకరాలన్నీ పోయాయి, పుత్రుని మారకుడు కృష్ణుడేనని తెలుసుకున్న వీనితల్లి, కృష్ణుని వేడు కుంటుంది. వంద తప్పులు కాయమని కోరింది, మేనత్త కోరిక మన్నించాడు, కృష్ణుడు. అందుచేత, వీడు హరి చేత హతుడవటం ఖాయమని, శాంతం వహించమని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు శిశుపాలుడు చేసిన తప్పులిలా చెప్పేడు.
ప్రాగ్జ్యోతిషంబున భగదత్తుపయి నేము వోయిన నిత డన్యాయవృత్తి
నిట బాలవృద్ధుల కెల్లభయంబుగా ద్వారకాపురి గాల్చె వీరులైన
భోజరాజన్యులు పొలతులతోడ రైవతకాద్రి గ్రీడాభిరతి బ్రమత్తు
లయి యున్నవారల నదయుడై వధించె దేవాభు డగువసుదేవు చేయు
నశ్వమేధమునకు నభ్యర్చితంబైన హయమునపహరించి యజ్ఞమునకు
విఘ్న మాచరించె వీ డతిపాపుడై బభ్రుభార్య దనకు భార్య జేసె…..భార……సభా.పర్వమ్….ఆశ్వా…2…..65
మఱియు వాగ్విషయంబు లయినయపకారంబు లనేకంబులు సేసె మా యత్త సాత్వతి నన్నుం బ్రార్ధించుటం జేసి యిద్దురాత్ముండు సేసినయపరాధశతంబు సహించితి నిప్పుడు మీరిందఱు నెఱుంగ నాయందకారణవ్యతిక్రమం బుపక్రమించి యత్యంత శత్రుండయ్యె…….భార..సభా.పర్వం…ఆశ్వా..2…..66
భగదత్తునిపైకి మేము యుద్ధానికి వెళితే ఇతడు బాలలు,వృద్ధులు,ఉన్న ద్వారకను కాల్చేశాడు, రైవతక పర్వతం మీద స్త్రీలతో క్రీడా వినోదంలో ఉండి, జాగరూకతలో లేని భోజుడు, మిగిలినవారలను చంపేశాడు, వసుదేవుడు అశ్వమేధం చేస్తుంటే, దానికోసం ఉంచిన గుఱ్ఱాన్ని దొంగిలించుకుపోయి యజ్ఞం పాడుచేసేడు, బభ్రువు భార్యను తనకు భార్యగా చేసుకున్నాడు, ఇవే కాక చాలా తప్పులు చేసేడు, మా అత్తకిచ్చిన మాట ప్రకారంగా ఇన్ని తప్పులూ సహించాను, ఇప్పుడు అకారణంగా నా మీద శత్రుత్వం వహిస్తున్నాడు అని చెబుతుండగా, శిశుపాలుడు, నీతో స్నేహం,విరోధం నాకెందుకోయ్, నాకిస్తానన్న అమ్మాయిని తీసుకుపోయి నువ్విలా మాట్లాడటానికి సిగ్గు లేదా అన్నాడు.
ఇంక కృష్ణుడు సహించలేక, చక్రాన్ని ప్రయోగిస్తే అది శిశుపాలుని తల తరిగితే, వానిలోనుంచి ఒక జ్యోతి వచ్చి కృష్ణుని చేరుతుంది, అందరూ ఆశ్చర్యపడగా.
కృష్ణునికి శిశుపాలుడొక మేనత్త కొడుకైతే, పాండవులు మరొక మేనత్త కొడుకులు. అర్హుడయిన కృష్ణుని పూజిస్తే, అసూయతో శిశుపాలుడు గొడవ చేసేడు, ఫలితం అనుభవించడు కూడా. అర్హులయిన వారిని పొగిడినపుడు, పూజించినపుడు తప్పు పడితే ఇలాగే జరుగుతుంది, సినిమా వారు దీన్నెలా తీశారో మరి.
టపాలు పెద్దవి రాయకూడదని నిర్ణయం తీసుకున్నా, ఐనా ఇది పెద్దదయిపోయింది. అందుకు మిగతా రేపు మీరు పొగిడినా తెగిడినా సరే! 🙂